8, జూన్ 2011, బుధవారం

బాబా రామ్ దేవ్ వెనక ఆర్.ఎస్.ఎస్ ఉందట!

దక్షిణ భారత దేశంలో బి.జె.పి పార్టీ విస్తరణకు అహరహం శ్రమిస్తూ వచ్చిన వెంకయ్య నాయుడుగారు బాబా రాందేవ్ తలపెట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం వెనక ఆర్.ఎస్.ఎస్ ఉన్నట్లుగా పరోక్షంగా అంగీకరించాడు. "అవినీతి వ్యతిరేక పోరాటం వెనక ఆర్.ఎస్.ఎస్ ఉంటే తప్పేమిటి?" అని ఆయన ప్రశ్నించారు. దానితో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఉందనేది స్పష్టమైందనే భావించాల్సి ఉంటుంది. 
2014 లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానంటున్న రాందేవ్ అవినీతి పోరాటం రాజకీయాలకు అతీతం కాదని ఇప్పుడిక చెప్పలేము. బాబా రాందేవ్ అరెస్టు, గెంటివేతపై బి.జె.పి ప్రత్యేకంగా నిరసన కార్యక్రమం కూడా చేపట్టినందున బాబా రాందేవ్ రాజకీయ భావాజాలం ఏమిటో కూడా అర్ధం అయినట్లేనేమో!  కాని బి.జె.పి తరపునే కార్యక్రమం జరిపితే అది గుంపులో గోవిందంలా మారి తన ఐడెంటిటీ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతోనే రాందేవ్ వేరుగా ఉంటున్నాడని కొంతమంది వాదిస్తున్నారు. ఆయనకి రు.180 కోట్ల ఆయుర్వేద వైద్య, యోగా సామ్రాజ్యమని కూడా రాయిటర్స్ సంస్ధ తెలిపింది.
  • ఇంతకీ రాజకీయ లక్ష్యాలు ఉన్న బాబా రాందేవ్ అవినీతి వ్యతిరేక పోరాటం స్వచ్ఛమైనదేనా?
  • 2014లో ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుండే ఇటువంటి ఆందోళనల ద్వారా పలుకుబడిని నిర్మించుకుంటున్న రాందేవ్ పోరాటం ప్రజల మేలుకు ఉద్దేశించినదేనా?

5, జూన్ 2011, ఆదివారం

బాబా రామ్ దేవ్ కి ఆర్.ఎస్.ఎస్ తో సంబంధాలున్నాయా?

భారత దేశ యూగా గురువు, తన యోగ విద్య ద్వారా భారత దేశ కీర్తిని దశదిశలా వ్యాపింప జేసిన బాబా రామ్ దేవ్ ఇప్పుడొక మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారత దేశంలో రాజకీయ నాయకులు, అధికారుల అవినీతిపై ఆయన యుద్ధం ప్రకటించారు. స్విస్ బ్యాంకుల్లాంటి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న ధనంలో అత్యధిక భాగం భారతీయులదే అని ఒక సర్వేలో తేలిందన్న విషయాన్ని గమనిస్తే, భారతీయులు నిజానికి పేదలు కాదనీ, భారత దేశ రాజకీయ నాయకుల చేత మోసగించబడిన "ధనిక" పేదలనీ అర్ధం అవుతుంది.

బాబా రాందేవ్ విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని భావిస్తున్న నాలుగు కోట్ల కోట్ల రూపాయల్ని అర్జెంటుగా ఇండియా రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అవినీతికి ఎవరూ పాల్పడకూదని డిమాండ్ చేస్తున్నారు. నిన్న గాక మొన్న అన్నా హజారే కూడా లోక్ పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేసి ప్రభుత్వ హామీతో విరమించుకున్నాడు. హామీతో తనని ప్రభుత్వం మోసగించిందనీ తనలాగా రాందేవ్ మాత్రం మోసపోకూడదని కూడా ఆయన హెచ్చరించారు.

సరే అంతా బాగానే ఉంది. రాందేవ్ దీక్ష విజయవంతంగా మొదలయ్యింది. ఆయన దీక్ష విరమించకుండా చేయడానికి ప్రభుత్వం నలుగురు మంత్రుల్ని పంపినా కుదర్లేదు.

అయితే బాబా రాందేవ్ దీక్ష వెనక అర్.ఎస్.ఎస్ ఉందని ఇపుడు చాలామంది ఆరోపిస్తున్నారు. ఆ అర్.ఎస్.ఎస్ మద్దతు బి.జె.పి పార్టీకి కూడా ఉంది. అదీ రాజకీయ పార్టీయే. ఎన్.డి.ఏ పాలనలోనూ బి.జె.పి పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారికీ ఏ శిక్షా పడలేదు.  నా అనుమానాలెంటంటే...

  • నిజంగానే ఆర్.ఎస్.ఎస్ కీ బాబా రాందేవ్ కీ సంబంధాలున్నాయా?
  • ఆర్.ఎస్.ఎస్ తో సంబంధాలుంటే ఆయన వెనక బి.జె.పి కూడా ఉన్నట్లేగా?
  • అర్.ఎస్.ఎస్ తో సంబంధాలు లేనట్లయితే ఆయన తుదికంటా నిరాహార దీక్ష చేస్తారా? లేక హామీలకు లొంగి ముగిస్తారా?
  • అవినీతిపైన యుద్ధం ప్రకటించినాయన ప్రధాన మంత్రినీ, సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ నీ లోక్ పాల్ చట్టం నుండి ఎందుకు మినహాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు?
  • గతంలో ప్రధాని రాజీవ్, ఛీఫ్ జస్టిస్ బాల కృష్టణ్ లపై అవినీతి ఆరోపణలు వచ్చిందాన్ని బట్టి వారూ అవినీతికి అతీతులు కాదని స్పష్టం అవుతోంది కదా? మరి వారిని లోక్ పాల్ నుండి ఎందుకు మినహాయించాలి?

బాబ్బాబు. ఈ అనుమానాలతో నాకు నిద్రే పట్టడం లేదు. ఎవరైనా ఈ అనుమానాలు తీర్చి పుణ్యం కట్టుకుంటారా?